డిజిటల్ భూ రికార్డుల ఆధునీకరణకు రూ. 565.50 కోట్లు
డీఐఎల్ఆర్ఎంపీ 3.0 ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలో సమీకృత, జీఐఎస్ (GIS) ఆధారిత డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థను సృష్టించేందుకు రూ. 565.50 కోట్ల కేటాయింపుతో ‘డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం (DILRMP) 3.0’ మార్గదర్శకాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ప్రారంభించారు. 2026-2031 కాలానికి గాను 100 శాతం కేంద్ర నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూమి కేవలం మట్టి ముద్ద కాదని, రైతుల గర్వమని పేర్కొంటూ పౌరులకు భూ సేవలను సులభతరం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ నూతన కార్యక్రమం ద్వారా భూ మోసాలను అరికట్టేందుకు ప్రతి భూఖండానికి 'భూ-ఆధార్' (ULPIN) పేరుతో 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే, ఎక్కువ రద్దీ ఉండే 75 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను 'రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు'గా అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు భూ రికార్డులు, మ్యాప్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు మరియు కోర్టు కేసుల సమాచారాన్ని సాంకేతికంగా అనుసంధానిస్తూ జాతీయ ల్యాండ్ స్టాక్ను రూపొందిస్తారు. పట్టణ ప్రాంతాల్లో 'నక్షా' పైలట్ ప్రాజెక్ట్ ద్వారా జీఐఎస్ ఆధారిత రికార్డులను సృష్టించి 'అర్బన్ ప్రాపర్టీ కార్డులు' జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.