అహ్మదాబాద్ ఎన్సిబిని సందర్శించిన 21 దేశాల ప్రతినిధులు
మాదకద్రవ్యాల నిరోధంపై అంతర్జాతీయ లెక్చర్
ఢిల్లీ: రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (RRU) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఐటెక్' (ITEC) కార్యక్రమంలో భాగంగా 21 విదేశాలకు చెందిన 50 మంది ఉన్నతాధికారులు గుజరాత్లోని అహ్మదాబాద్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలలో మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
ఈ సందర్భంగా భారత దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్సిబి అనుసరిస్తున్న విధివిధానాలు, ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ప్రస్తుతం కొనసాగుతున్న గంజాయి, డ్రగ్స్ సప్లై నెట్వర్క్ పోకడలపై విదేశీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు.
చట్టాన్ని కఠినంగా అమలు చేయడం, సరిహద్దుల దాటి జరిగే డ్రగ్స్ రవాణాను కట్టడి చేయడంలో పాటించాల్సిన ఉత్తమ పద్ధతులను ఈ భేటీలో పంచుకున్నారు. ఈ చర్చల ద్వారా వివిధ దేశాల మధ్య పరస్పర అవగాహన, జ్ఞాన మార్పిడి పెరిగి, అంతర్జాతీయ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాడేందుకు సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారులు తెలిపారు.