వస్త్ర వ్యర్థాల నుండి విలువైన ఉత్పత్తులు
GeM, టెక్స్టైల్స్ కమిటీ మధ్య చారిత్రాత్మక ఒప్పందం
ముంబై: వస్త్ర వ్యర్థాలు, పాత బట్టల రీసైక్లింగ్ను ప్రోత్సహించడంతో పాటు వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోళ్లతో అనుసంధానించేందుకు భారీ అడుగు పడింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ప్లేస్ (GeM), టెక్స్టైల్స్ కమిటీ (TC) మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ముంబైలో జరిగిన టెక్స్టైల్స్ కమిటీ 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, మహారాష్ట్ర జౌళి శాఖ మంత్రి సంజయ్ సవ్కరే సమక్షంలో GeM అదనపు సీఈఓ అజిత్ బి చవాన్, జౌళి కమిటీ కార్యదర్శి కార్తికేయ ధండా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ భాగస్వామ్యం ద్వారా రీసైకిల్, అప్సైకిల్ చేసిన వస్త్ర ఉత్పత్తులకు ప్రభుత్వ సేకరణలో ప్రాధాన్యత కల్పిస్తారు. 'వ్యర్థాల నుండి విలువకు, అక్కడి నుండి మార్కెట్కు' అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం సాగనుంది.
టెక్స్టైల్స్ కమిటీ రీసైకిల్ చేసిన వస్త్రాల ఉత్పత్తిదారులను గుర్తించి, వారి ఉత్పత్తులను ధ్రువీకరించి ప్రమాణాలను నిర్ధారిస్తుంది. GeM పోర్టల్లో ఈ రీసైకిల్ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక విభాగాలను సృష్టిస్తారు. చిన్న రీసైక్లర్లు, అప్సైక్లర్లకు ఆన్లైన్ విక్రయాలపై శిక్షణ ఇస్తారు. జౌళి కమిటీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా స్థానిక రీసైక్లర్లను సమీకరించి, వారి సామర్థ్య పెంపునకు సాంకేతిక సహకారాన్ని అందిస్తారు.
ఈ చొరవ వల్ల స్థానిక MSMEలు, మహిళా స్వయం సహాయక బృందాలు, కళాకారులు మరియు చిన్న వ్యాపారులకు గొప్ప లబ్ధి చేకూరనుంది. 'వోకల్ ఫర్ లోకల్', 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో భాగంగా ఈ కార్యక్రమం వికేంద్రీకృత వస్త్ర ఉత్పత్తికి మద్దతు ఇస్తుందని GeM సీఈఓ మిహిర్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో బహుమతులు, ఇతర వినియోగాల కోసం ఈ రీసైకిల్ ఉత్పత్తుల వాడకాన్ని పెంచనున్నారు.