సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తితో రక్షణ రంగంలో భారత్-బెల్జియం భాగస్వామ్యం బలోపేతం
న్యూఢిల్లీ: సాయుధ బలగాల బలోపేతంతో పాటు ఉమ్మడి భద్రత లక్ష్యంగా రక్షణ సాంకేతికతల సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తిపై భారత్, బెల్జియం దేశాలు దృష్టి సారించాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన 'భారత్-బెల్జియం డిఫెన్స్ సీఈఓల రౌండ్టేబుల్, బీ2బీ సమావేశం'లో ఇరు దేశాలు రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత లోతుగా పెంచుకోవాలని పిలుపునిచ్చాయి. ఈ సమావేశంలో బెల్జియం రక్షణ, విదేశీ వాణిజ్య శాఖ మంత్రి థియో ఫ్రాంకెన్, భారత రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
మారుతున్న ప్రపంచ భద్రతా పరిణామాల దృష్ట్యా ఇరు దేశాల సైనిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఉమ్మడి ప్రయత్నాలు ఆవశ్యకమని బెల్జియం మంత్రి థియో ఫ్రాంకెన్ తెలిపారు. సముద్ర భద్రత, ఏరోస్పేస్, సమాచార భద్రత రంగాల్లో భారత్-ఈయూ భాగస్వామ్యం విస్తరిస్తోందని, భారతీయ పారిశ్రామికవేత్తల చైతన్యాన్ని ఆయన కొనియాడారు.
రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ మాట్లాడుతూ.. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' వేదికల ద్వారా భారతదేశం రక్షణ దిగుమతుల స్థాయి నుండి స్వదేశీ ఉత్పాదన, సాంకేతిక భాగస్వామ్యాలు మరియు ఎగుమతుల దిశగా వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు.
సైబర్ భద్రత, ఏఐ ఆధారిత అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (డ్రోన్లు), జలాంతర్గామి వాహనాలు, అధునాతన ఆయుధ వ్యవస్థల అభివృద్ధి. క్వాంటం టెక్నాలజీ, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, డిఫెన్స్ కమ్యూనికేషన్లో ఆవిష్కరణల కోసం iDEX, ADITI వంటి ప్లాట్ఫారమ్ల వినియోగం. రక్షణ రంగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 74 శాతం, ప్రభుత్వ అనుమతితో 100 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) అవకాశం. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్లతో పాటు మహారాష్ట్ర, అస్సాంలలో కొత్త కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలు.
బెల్జియం సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారత పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాలను అనుసంధానించేలా సదస్సులో అనేక ఒప్పందాలు కుదిరాయి. SIDM - బెల్జియన్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీలతో పాటు, ఎల్ అండ్ టీ, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, ఇండియా ఆప్టెల్ వంటి దిగ్గజ భారతీయ సంస్థలు బెల్జియన్ టెక్నాలజీ కంపెనీలైన థేల్స్ బెల్జియం, ఎఫ్ఎన్ హెర్స్టల్, ఎక్సైల్ రోబోటిక్స్ మొదలైన వాటితో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.