ఏరోస్పేస్, స్వదేశీ నావిగేషన్లో దూసుకెళ్తున్న భారతదేశం
'గగన్'తో సరికొత్త ఘనత
న్యూఢిల్లీ: తక్కువ తయారీ వ్యయం, ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం ఏరోస్పేస్, విమానయాన రంగాల్లో వేగంగా విస్తరిస్తోంది. జెఫరీస్ నివేదిక ప్రకారం ప్రపంచ విమాన తయారీ దిగ్గజాలైన బోయింగ్, ఎయిర్బస్ ప్రస్తుతం భారత్ నుంచి ఏటా సుమారు 1.4 నుండి 1.6 బిలియన్ డాలర్ల విలువైన పరికరాలను పొందుతుండగా, అనేక భారతీయ సంస్థలు గ్లోబల్ OEM మరియు టైర్-1 సరఫరాదారులుగా ఎదుగుతున్నాయి.
ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంయుక్తంగా అభివృద్ధి చేసిన 'గగన్' (GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్) వ్యవస్థ దేశీయ నావిగేషన్ సామర్థ్యాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ (SBAS) అయిన గగన్, జిపిఎస్ కచ్చితత్వాన్ని మెరుగుపరచడంతో పాటు విమాన ప్రయాణాలకు అత్యంత సురక్షితమైన నావిగేషన్ను అందిస్తోంది.
2015 నుండి సేవలందిస్తున్న ఈ సాంకేతికతతో సొంత SBAS ఉన్న కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారత్ నిలిచింది. జూన్ 2026లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గగన్ ఆధారంగా వాణిజ్య జెట్ విమానంపై దేశంలోనే మొదటి సాటిలైట్ ఆధారిత ల్యాండింగ్ను విజవంతంగా నిర్వహించింది. GSAT-8, GSAT-10, GSAT-15 ఉపగ్రహాల మద్దతుతో పనిచేసే గగన్, భూమధ్యరేఖ ప్రాంతంలో ధృవీకరించబడిన మొదటి SBAS కావడం విశేషం. ఇది అమెరికా (WAAS), యూరప్ (EGNOS), జపాన్ (MSAS) వ్యవస్థలకు అనుకూలంగా పనిచేస్తుంది.
విమానయానంతో పాటు సముద్రయానం, రైల్వేలు, రక్షణ, విపత్తు నిర్వహణ, మ్యాపింగ్ వంటి రంగాల్లోనూ గగన్ ఉపయోగపడనుంది. భారత్ అందించే ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ 'NavIC'కి ఇది అనుబంధంగా సేవలు అందిస్తుంది. అంతర్జాతీయ విస్తరణలో భాగంగా 2025లో దక్షిణాఫ్రికాలో NavIC రిఫరెన్స్ స్టేషన్ ఏర్పాటుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సాంకేతిక ప్రగతి అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.