గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026
సమ్మిళిత, విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు జ్యోతిరాదిత్య సింధియా పిలుపు
ముంబై: ఆర్థిక వ్యవస్థ నిజంగా తెలివైనదిగా మారాలంటే అది అందరికీ అందుబాటులోకి రావాలని, ఆ దిశగా సమ్మిళిత, విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన 'గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2026'లో ఆయన ప్రసంగిస్తూ, టెలికాం కనెక్టివిటీయే ఫిన్టెక్ రంగానికి ప్రధాన అదృశ్య రహదారి అని అభివర్ణించారు. కనెక్టివిటీ, కంప్యూట్, విశ్వాసం అనేవి డిజిటల్ ఫైనాన్స్ తదుపరి దశను నడిపించే మూడు కీలక అంశాలని పేర్కొన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 25 కోట్ల నుంచి 100 కోట్లకు, బ్రాడ్బ్యాండ్ సదుపాయం 6 కోట్ల నుంచి 103 కోట్లకు పెరిగిందని ఆయన వివరించారు. స్మార్ట్ఫోన్లు నేడు సామాన్యులకు బ్యాంకింగ్ శాఖలుగా మారి రుణాలు, పెట్టుబడులకు మార్గం సుగమం చేశాయని, దాదాపు 6.5 లక్షల గ్రామాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయని తెలిపారు. కేవలం 26 నెలల్లోనే 5జీ సేవలు 99.9 శాతం జిల్లాలకు, 85 శాతం జనాభాకు చేరువయ్యాయని పేర్కొన్నారు.
యూపీఐ సాంకేతికతను భారత్ సాధించిన సాధికారతకు ప్రతీకగా చెబుతూ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 740కి పైగా బ్యాంకుల ద్వారా దాదాపు రూ. 314 లక్షల కోట్ల విలువైన 24,162 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని వెల్లడించారు. దేశీయ డిజిటల్ లావాదేవీలలో 84 శాతం యూపీఐ ద్వారానే జరుగుతుండగా, ప్రపంచ రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వాటా 49 శాతంగా ఉందన్నారు. ప్రస్తుతం 9 దేశాల్లో సేవలు అందిస్తున్న యూపీఐని మరో 20 దేశాలకు విస్తరించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు 'సంచార్ సాథీ', ఏఐ ఆధారిత 'ASTR', ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) వంటి సాధనాలు దోహదపడుతున్నాయని తెలిపారు. డిజిటల్ భారత్ నిధి ద్వారా కనెక్టివిటీ లేని 34,000 గ్రామాల కోసం 22,000 టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే ప్రపంచ 6జీ పేటెంట్లలో 10 శాతం వాటా సాధించడమే లక్ష్యంగా '6జీ మిషన్' ప్రారంభించామని మంత్రి ప్రకటించారు.