250కి పైగా ట్రక్కుల సరుకును మోసుకెళ్తున్న డబుల్-స్టాక్ ఫ్రైట్ రైలు
వడోదర: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) అందుబాటులోకి రావడం వల్ల భారతదేశ రవాణా రంగం సరికొత్త రూపురేఖలు సంతరించుకుందని, లాజిస్టిక్స్ ఖర్చులు, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, రూ. 35,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) మరియు వడోదర మధ్య ఇటీవల నడిచిన డబుల్-స్టాక్ కంటైనర్ ఫ్రైట్ రైలు ఒకే ట్రిప్లో ఏకంగా 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును మోసుకెళ్లిందని వెల్లడించారు. 2014కు ముందు గత ప్రభుత్వ హయాంలో ఏడేళ్లపాటు ఒక్క కిలోమీటరు కూడా పూర్తికాని ఈ డీఎఫ్సీ ప్రాజెక్ట్ను తాము వేగవంతం చేశామని గుర్తుచేశారు.
ప్రస్తుతం 2,800 కిలోమీటర్ల పొడవైన తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు దేశ వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచాయని ప్రధాని అన్నారు. ఈ రెండు మార్గాల్లో ప్రతిరోజూ 430కి పైగా సరుకు రవాణా రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. గతంలో సరుకు రవాణా రైలు 100 కిలోమీటర్లు వెళ్లేందుకు 6.5 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు అందులో సగానికంటే తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. అలాగే రోడ్డు మార్గంలో ట్రక్కులకు 30 గంటలు పట్టే ప్రయాణం, డీఎఫ్సీ ద్వారా కేవలం 10 నుంచి 12 గంటల్లోనే పూర్తవుతోందని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులపై కోచింగ్ ఫీజుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అగ్రశ్రేణి ఉపాధ్యాయుల ద్వారా ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.