మూడు రాష్ట్రాల్లో ఐటీఐల ఆధునీకరణకు ₹735.70 కోట్లు
పీఎం-సేతు కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ:దేశంలో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘పీఎం-సేతు’ (ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్) జాతీయ స్టీరింగ్ కమిటీ తన 5వ సమావేశంలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐటీఐ క్లస్టర్ల కోసం ₹735.70 కోట్ల అంచనా వ్యయంతో కూడిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీనియర్ అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ తాజా నిర్ణయంతో పీఎం-సేతు కింద మంజూరైన మొత్తం పెట్టుబడుల విలువ ₹2,171 కోట్లకు చేరింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని మెడ్చల్ ఐటీఐ క్లస్టర్ ఆధునీకరణకు ₹254.30 కోట్లు మంజూరయ్యాయి. మేసర్స్ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో సాగే ఈ ప్రణాళికలో మెడ్చల్ ఐటీఐ హబ్గా వ్యవహరించనుండగా.. అల్వాల్, షమీర్పేట్, కుకునూర్పల్లి, సిద్దిపేట ఐటీఐలు స్పోక్స్గా సేవలు అందిస్తాయి. అలాగే రాజస్థాన్లోని భివాడి క్లస్టర్కు ₹241 కోట్లు, ఉత్తర ప్రదేశ్లోని మీరట్ క్లస్టర్కు ₹240.40 కోట్లు కేటాయించారు.
హబ్-అండ్-స్పోక్ మోడల్లో సాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఐటీఐలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తు సాంకేతికతలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.