పండుగ సీజన్ నేపథ్యంలో ఢిల్లీలో ఆహార భద్రత తనిఖీలు ముమ్మరం
2,800 కిలోలకు పైగా కల్తీ ఆహార పదార్థాలు ధ్వంసం
న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్ను పురస్కరించుకుని ఢిల్లీ ఆహార భద్రత శాఖ నగరంలోని ప్రధాన మార్కెట్లలో తనిఖీలను ముమ్మరం చేసింది. సోమవారం నిర్వహించిన సోదాల్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన, దుర్వాసన వస్తున్న సుమారు 2,800 కిలోలకు పైగా అసురక్షిత కోవా, ధాప్ మరియు వెన్నను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఈ విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఆహార భద్రత బృందాలు ఖోయా మండి, మోరీ గేట్, బాగ్ దీవార్, సంజయ్ మార్కెట్ మరియు జనక్పురి మండి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించాయి. మోరీ గేట్, సంజయ్ మార్కెట్ పరిసరాల్లో స్వాధీనం చేసుకున్న 2,830 కిలోల పాడైపోయిన కోవా, వెన్నను క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' నిబంధనల ప్రకారం మజ్ను కా తిలాలోని MCD డంపింగ్ సైట్లో అధికారులు వాటిని ధ్వంసం చేశారు.
లాబొరేటరీ పరీక్షల్లోనూ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మోరీ గేట్ నుంచి సేకరించిన 10 కోవా, క్రీమ్ నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. జనక్పురి మండిలో నిర్వహించిన తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ వీల్ ద్వారా పరీక్షించిన కొన్ని శాంపిల్స్లో డిటర్జెంట్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, అక్కడ ముందస్తు జాగ్రత్తగా 150 కిలోల పనీర్, 10 కిలోల కోవాను అక్కడికక్కడే నాశనం చేశారు.
పండుగ వేళ స్వీట్లు, పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హెచ్చరించారు. పండుగ సీజన్ ముగిసే వరకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.