నేపాల్ వరదల్లో 84 మంది భారతీయుల రక్షణ
63 మంది పేర్ల జాబితాను విడుదల చేసిన విదేశాంగ శాఖ!
న్యూఢిల్లీ: నేపాల్ను ముంచెత్తిన ఘోర ఆకస్మిక వరదల నేపథ్యంలో రక్షించబడిన 63 మంది భారతీయుల జాబితాను భారత విదేశాంగ శాఖ (MEA) విడుదల చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.
త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న 63 మంది కార్మికులతో పాటు కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులను (మొత్తం 84 మంది భారతీయులను) సురక్షితంగా రక్షించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగిలిన బాధితుల భద్రతను నిర్ధారించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
రసువా జిల్లాలోని భోటే కోషి, త్రిశూలి నదుల్లో ఒక్కసారిగా ఉప్పొంగిన ఒండ్రు మట్టి, రాళ్లతో కూడిన వరద దాటికి ఇప్పటివరకు*359 మంది ప్రాణాలు కోల్పోగా, 910 మంది ఆచూకీ లభించలేదు. అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 132 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారిలో 517 మంది విదేశీయులు ఉండగా, 100 మందికి పైగా నేపాల్ భద్రతా సిబ్బంది మరియు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు.
నేపాల్ ప్రధాని బాలెన్ షా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సుమారు 13,295 మంది భద్రతా సిబ్బందిని రక్షణ చర్యల్లో దించినట్లు, గాల్లో హెలికాప్టర్ల ద్వారా 573 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. బాధితుల కోసం అత్యవసర నిధులను విడుదల చేశారు.
విపత్తు తీవ్రత దృష్ట్యా భారత్ తక్షణమే స్పందించి 47.5 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని రెండు ప్రత్యేక విమానాల్లో కాఠ్మండుకు పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తెలిపారు. ఇందులో ప్రాణరక్షణ మందులు, విపత్తు నిర్వహణ పరికరాలు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అన్ని విధాలా అండగా ఉంటామని భారత్ స్పష్టం చేసింది.