భారత్–కెనడా మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం
2030 నాటికి ₹4.65 లక్షల కోట్ల వాణిజ్యమే లక్ష్యం!
న్యూఢిల్లీ: భారతదేశం మరియు కెనడా మధ్య ఆర్థిక, ద్రవ్య సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు కీలక అడుగు వేశాయి. తొలి 'కెనడా-భారత్ ఆర్థిక మంత్రుల స్థాయి చర్చలు' ముగిసిన అనంతరం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపేన్ ల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 70 బిలియన్ కెనడియన్ డాలర్లకు (సుమారు రూ. 4.65 లక్షల కోట్లు) పెంచాలని ఇరు దేశాలు సంయుక్తంగా లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కెనడాలోని చెల్లింపు సేవా ప్రదాతలతో భాగస్వామ్యం ద్వారా భారత ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) వినియోగాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఇది వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన చెల్లింపులకు, అలాగే పర్యాటకం, విద్యా రంగాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. భారత్ లో కెనడియన్ పెన్షన్ ఫండ్లు, సంస్థాగత పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫిన్టెక్, ఇంధనం, మౌలిక సదుపాయాలు మరియు కీలక ఖనిజాల సరఫరా గొలుసుల భద్రతపై పరస్పరం సహకరించుకోవడానికి అంగీకారం కుదిరింది.
2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పంద చర్చలను పూర్తి చేయాలని భావిస్తుండగా, తదుపరి ఆర్థిక మంత్రుల స్థాయి సమావేశం 2027లో జరగనుంది.
ప్రస్తుతం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 2 వరకు కెనడా, అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నిర్మలా సీతారామన్, కెనడియన్ వ్యాపార దిగ్గజాలతో వరుస రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.