devotional
రక్షణ, పౌర సేవల కోసం సరికొత్త విమానాశ్రయం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
సూర్య తెలంగాణ డెస్క్: ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్లో రక్షణ మరియు పౌర విమానయాన అవసరాల కోసం ఉమ్మడి విమానాశ్రయం (జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టును మిషన్ మోడ్లో వేగవంతం చేయాలని నిర్ణయించారు. కేంద్ర రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమన్వయం కోసం ప్రత్యేకంగా ఒక్కో నోడల్ అధికారిని నియమించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్), మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ పరిధిలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆధీనంలో ఉన్న సుమారు 369.45 ఎకరాల భూమికి అదనంగా, తెలంగాణ ప్రభుత్వం మరో 1500 ఎకరాల భూమిని సేకరించి అప్పగించాల్సి ఉంది. రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారని, బోయింగ్ మరియు ఎయిర్బస్ వంటి ప్రయాణికుల విమానాల రాకపోకలకు అనుగుణంగా సుమారు 2.75 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణానికి ప్రాథమిక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
రక్షణ రంగానికి సంబంధించి ఈ ప్రాంగణంలో పూర్తి స్థాయి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పైలట్ శిక్షణ కేంద్రం, ఆపరేషనల్ కాంప్లెక్స్, విమానాల హ్యాంగర్లు, వాతావరణ రక్షణ కేంద్రాలు, అలాగే సిబ్బంది నివాస సముదాయాలు కొలువుదీరనున్నాయి. అదే సమయంలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆధునిక ప్యాసింజర్ సివిల్ టెర్మినల్ మరియు విమానాల మరమ్మతులు, నిర్వహణ చేపట్టే ఎంఆర్ఓ (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్) యూనిట్ను అభివృద్ధి చేయనున్నారు. రక్షణ రంగానికి వ్యూహాత్మకంగా ఉపయోగపడే ఈ బేస్ ద్వారా స్థానికంగా సాధారణ పౌరులకు కూడా పూర్తి స్థాయి విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరు కావడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం పుంజుకోనుంది. రాజధాని హైదరాబాద్కు సుదూరంగా ఉండే ఈ సరిహద్దు ప్రాంతానికి వైమానిక అనుసంధానం ఏర్పడితే స్థానిక వాణిజ్యం, పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతాయి. దేశ రక్షణలో కీలక వ్యూహాత్మక స్థావరంగా నిలవడంతో పాటు స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి విమాన రాకపోకలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.