ఈశ్వర్ సాయి కేసులో అనూహ్య మలుపు.. డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..
సూర్య క్రైమ్ డెస్క్: ప్రముఖ తెలంగాణ జానపద నృత్యకారిణి మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు నిందితుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమయానికి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కాపాడి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో సామాజిక మాధ్యమాల్లో మరియు జానపద కళాకారుల వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొంతకాలంగా కలిసి వీడియోలు, ఆల్బమ్స్ చేస్తున్న క్రమంలో తనను ప్రేమ పేరుతో నమ్మించి, వివాహం చేసుకుంటానని మోసం చేశాడని ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు అతడిని అరెస్ట్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఈశ్వర్ సాయిని కేసు నుంచి తప్పించేందుకు నార్సింగి పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులను ఆశ్రయించినా న్యాయం దక్కడం లేదన్న నిరాశ, మానసిక వేదనతోనే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వ్యవహారంలో పోలీసుల ఉదాసీన వైఖరిపై మహిళా సంఘాలు, తోటి కళాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ న్యాయం కోసం పోలీసుల గడప తొక్కితే నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సైబరాబాద్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిందితుడు ఈశ్వర్ సాయిని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు, మోసాలు ఎదురైనా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, మానసిక సంక్షోభంలో ఉన్నవారు వెంటనే సంబంధిత హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించి కౌన్సిలింగ్ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.