చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువు కట్ట వద్ద మున్సిపల్ అధికారులు పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న చెరువు కట్టను పరిశీలించి, నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సిబ్బందికి సూచించారు.
నిమజ్జన ప్రాంతంలో పారిశుధ్యం, చెత్త తొలగింపు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యక్రమం పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, నిమజ్జన ఘాట్ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు నిరంతరం కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఎం.ఈ. నాగభూషణం రెడ్డి, డీఈలు పవన్ కుమార్, రసూల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్వైజర్ లక్ష్మినారాయణ, శివ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.