|
|
by Suryaa Desk | Wed, Mar 04, 2026, 07:52 PM
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ షిప్పులు ఎక్కడికక్కడ ఆగిపోయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో పెట్రోల్ బంకులు మూతపడతాయని, లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.500 వరకు పెరుగుతుందని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ పాతబస్తీలోనూ ఈ న్యూస్ వైరల్ అయింది. దీంతో ఆ వార్తలను నమ్మిన పలువురు యువకులు.. పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకున్నారు. వాహనాలు ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు బారులు తీరారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువకులు పెద్ద ఎత్తున బైకులు, బాటిళ్లలో పెట్రోల్ కోసం బంక్లో క్యూ కట్టడం కనిపించింది. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చొని పెట్రోల్ పోయించుకున్నారు.
కాగా, పెట్రోల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతాయనేది పూర్తిగా అవాస్తవం అని అంటున్నారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెబుతున్నారు. కొందరు కావాలనే చేసే తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు చేరుకోవడంతో అనవసరమైన రద్దీ ఏర్పడుతోందని దాని కారణంగా సామాన్య వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పలువురు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ వర్గాలు, అధికారిక చమురు సంస్థలు పెట్రోల్ సరఫరా నిలిపివేత, ధరల పెంపుపై ఎటువంటి ప్రకటన చేయలేదని ప్రజలు గమనించాలని చెబుతున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలు, వార్తలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అంటున్నారు. ఏదైనా సమాచారం ఉంటే అధికారిక వార్తా సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని కోరుతున్నారు. అనవసరంగా భయాందోళనలకు గురై పెట్రోల్ ఎక్కువగా నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.