సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం
సూర్య నందిపేట్,
నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో అంతరాష్ట్ర నేరస్థుడు షేక్ ఖయ్యుమ్ రఫిక్ బేగ్ (23)ను నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీ చేసిన 10 తులాల 8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్భణి జిల్లా దర్గా రోడ్ ప్రాంతానికి చెందిన ఖయ్యుమ్పై మహారాష్ట్ర, కర్ణాటకలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. 2023లో అతని నుంచి మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ కేసుల్లో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు.
నందిపేట్లో చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు నిజామాబాద్ వైపు వెళ్తుండగా నవీపేట్ రైల్వేస్టేషన్ వద్ద నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. విచారణలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ వినయ్, హెచ్సీ నరేందర్, కానిస్టేబుళ్లు అనీల్, శ్రీనివాస్, షబ్బీర్, మహిపాల్ను ఉన్నతాధికారులు అభినందించారు.