జాతీయ లోక్ అదాలత్ లో 2132 కేసుల పరిష్కారం
రాజీతో కేసుల పరిష్కారానికి ప్రజలు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13): జాతీయ లోక్ అదాలత్లో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 2,132 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, ఈ-పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు. వీటిలో 348 రాజీ కుదిరిన ఎఫ్ఐఆర్ కేసులు, 427 ఈ-పెట్టి కేసులు, 1,357 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి.
పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, సంబంధిత కక్షిదారులతో సమన్వయం చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరంగా పరిష్కరించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. కోర్టు లైజన్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో కేసుల వివరాలను సిద్ధం చేసి కక్షిదారులకు అవసరమైన సహకారం అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఆర్థిక వ్యయం, న్యాయపరమైన శ్రమ తగ్గుతాయని తెలిపారు. ప్రజలు తమకు సంబంధించిన రాజీపడదగిన కేసులను లోక్ అదాలత్ వంటి ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కార వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.