భూ బాధితుల పై పోలీసుల ఉక్కుపాదం..!
పరిగి బస్టాండ్లో రోజంతా బైఠాయింపు.. అర్ధరాత్రి 1:30 గంటలకు రైతుల అరెస్ట్
పరిగి, మేజర్ న్యూస్: కాళ్లపూర్ భూబాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం పరిగి బస్టాండ్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పరిగి ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భూబాధితులు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
తమ భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని భూబాధితులు డిమాండ్ చేశారు. తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.
అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో భూబాధితులు నిరసనను కొనసాగించారు. దీంతో అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో పోలీసులు బస్టాండ్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
భూబాధితుల సమస్యలను ప్రభుత్వం ఇకనైనా పట్టించుకుని, వారి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.