చర్చల ద్వారా సంబంధాల పునరుద్ధరణకు భారత్, బంగ్లాదేశ్ కృషి
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను బలపరిచే దిశగా భారత్, బంగ్లాదేశ్ దేశాలు కృషి చేస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్కు భారత్ రెండు వేర్వేరు ఆహ్వానాలు పంపినట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇందులో ఒకటి ద్వైపాక్షిక పర్యటన కోసం కాగా, మరొకటి బిమ్స్టెక్ (BIMSTEC) ఛైర్మన్ హోదాలో బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి పంపినట్లు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
కాగా, పరస్పరం ఆమోదయోగ్యమైన సమయం కుదిరినప్పుడు ఈ పర్యటన ఖరారవుతుందని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కోబిర్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ ఒక నిరంతర ప్రక్రియ అని, 2027లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వాలని ఢాకా భావిస్తోందని ఆయన వెల్లడించారు. ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల అనంతరం, ఇరుదేశాలు తిరిగి దౌత్య సంబంధాలను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.