అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు అందేలా చర్యలు: మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల అర్బన్: నంద్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి స్థలం, టిడ్కో ఇళ్ల కేటాయింపు జరిగేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాలలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్లతో కలిసి నంద్యాల నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో టిడ్కో ఇళ్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్, ఖాళీగా ఉన్న ఇళ్ల వివరాలు తదితర అంశాలపై అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని టిడ్కో ఇళ్లను గరిష్ట స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అందుబాటులో ఉన్న ఇళ్లను ఖాళీగా ఉంచకుండా అర్హత కలిగిన లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయించాలని సూచించారు. నంద్యాల నియోజకవర్గంలో ఇంటి పట్టాల కోసం ఆన్లైన్లో దాదాపు 7,000 మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన ఇంటి పట్టాలు మంజూరు చేసే విధంగా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత, నిబంధనల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రయోజనం అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల అర్హత నిర్ధారణ, తదుపరి కేటాయింపు ప్రక్రియను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ ఈఈ, టిడ్కో ఈఈ, నంద్యాల మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, నంద్యాల, నంద్యాల రూరల్, గోస్పాడు తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.