సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్పై చర్యలకు బాధితుడి ఆందోళన
సూర్య క్రైమ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వ్యవహార శైలి తీవ్ర దుమారం రేపుతోంది. పిల్లలున్న వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రచించాడంటూ నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్య కుట్రకు సంబంధించిన వీడియో కాల్ ఆధారాలు బయటపడటంతో గ్రామ పెద్దలు ప్రశ్నించగా, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఉల్టా బాధితుడితో పాటు పది మంది గ్రామ పెద్దలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బాధితుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన మైనర్ కుమార్తె పట్ల కూడా సదరు రిపోర్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగడం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
బాధితుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా దుబ్బతండాకు చెందిన సతీష్ భార్యతో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సతీష్ను మార్గం నుంచి తప్పించి శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు వారిద్దరూ కలిసి హత్యకు పన్నాగం పన్నారు. దీనికి సంబంధించి వారి మధ్య జరిగిన వీడియో కాల్ సంభాషణల రికార్డింగులు సతీష్ చేతికి చిక్కడంతో అసలు కుట్ర బట్టబయలైంది. ఈ విషయాన్ని దుబ్బతండా గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా, వారు పంచాయితీ నిర్వహించి నిందితుడైన వెంకట్ రెడ్డిని నిలదీశారు. అయితే తన తప్పును తెలుసుకోవాల్సింది పోయి, రిపోర్టర్ వెంకట్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, పంచాయితీ చేసిన పది మంది గ్రామ పెద్దలపైనే అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని బాధితుడు ఆరోపించారు.
అంతేకాకుండా వెంకట్ రెడ్డి తన మైనర్ కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని, ప్రస్తుతం తనకు మరియు తన కుమార్తెకు ప్రాణహాని ఉందని బాధితుడు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రక్షణగా నిలబడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణాపాయం పొంచి ఉందని, వెంటనే స్పందించి నిందితుడైన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వెంకట్ రెడ్డిపై పోక్సో చట్టంతో పాటు హత్యాయత్నం కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని సతీష్ డిమాండ్ చేశారు. బాధితుడి ఆందోళనకు స్థానికులు కూడా మద్దతు తెలపడంతో సూర్యాపేట పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.