రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
ఎస్బీఐ మేనేజర్కు ఖాతాదారుల వినతి
బలవంతపు ఇన్సూరెన్స్ పాలసీలపై ఆందోళన
బొంరాస్పేట్, మేజర్ న్యూస్: మండల కేంద్రంలోని ఎస్బీఐ శాఖలో రైతులు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వినియోగదారులు బ్యాంకు అధికారులకు వినతిపత్రం అందజేశారు. బ్యాంకు సేవల్లో జాప్యం, గంటల తరబడి నిరీక్షణతో పాటు రుణాల కోసం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు.చిన్నపాటి బ్యాంకింగ్ పనుల కోసం కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీంతో రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవసరం లేని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం, పాలసీ తీసుకోకపోతే రుణాల విషయంలో జాప్యం చేయడం సరికాదన్నారు. అర్హులైన రైతులు, ఖాతాదారులకు బ్యాంకు నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సకాలంలో సేవలు అందించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి.బాబయ్య నాయుడు, బీఆర్ఎస్ నాయకులు కావలి అంజిలయ్య, యు.కృష్ణ, బాల్రెడ్డి, యు.జగదీష్తో పాటు వివిధ గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.