కల్లెడ శివారులో చిరుతల కలకలం!
పొలాల వైపు పరుగులు.. భయాందోళనలో గ్రామస్తులు – అప్రమత్తంగా ఉండాలని సూచనలు
సూర్య, మాక్లూర్: నిమాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుత పులులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాలు, పరిసర ప్రాంతాల్లో చిరుతల కదలికలు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు.
చిరుతల సంచారంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచిస్తున్నారు.
చిరుతల సంచారంపై అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి గ్రామ శివారులో గస్తీ పెంచాలని, కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.