పారా ఆర్చరీలో శీతల్ దేవి సంచలనం: అహ్మదాబాద్ టోర్నీలో స్వర్ణ పతకం కైవసం!
భారత పారా ఆర్చరీ సంచలనం శీతల్ దేవి మరోసారి తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వేదికపై దేశం గర్వపడేలా చేసింది. అహ్మదాబాద్ వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ సిరీస్ స్టేజ్-3 పోటీల్లో ఆమె అసాధారణ ప్రదర్శన కనబరిచింది. హోరాహోరీగా సాగిన మహిళల వ్యక్తిగత విభాగపు ఫైనల్ మ్యాచ్లో కజకిస్థాన్ స్టార్ ప్లేయర్ ఐజాడా సీదన్తో తలపడిన శీతల్, చివరి క్షణంలో చూపిన తెగువతో అరివీర భయంకరమైన ఆటతీరును ప్రదర్శించి విజయతీరాలకు చేరింది.
ఈ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం అత్యంత రసవత్తరంగా సాగింది. నిర్ణీత రౌండ్ల ముగిసేసరికి ఇద్దరు క్రీడాకారిణుల స్కోర్లు 144-144 పాయింట్లతో సమం కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠకు గురిచేసింది. విజేతను తేల్చేందుకు నిర్వహించిన హై-వోల్టేజ్ షూటాఫ్లో శీతల్ దేవి అత్యంత ఒత్తిడిని జయించి అద్భుతమైన పర్ఫెక్ట్ 10 కొట్టి ప్రత్యర్థిని అధిగమించింది. కజకిస్థాన్ ఆటగాడిపై 10-9 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఆమె, కట్ ఆఫ్ పాయింట్లో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటూ మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరవేసింది.
ఈ టోర్నమెంట్లో శీతల్ దేవికి ఇది రెండో పతకం కావడం విశేషం. ఇప్పటికే ఆమె టోమన్ కుమార్తో కలిసి నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ టీమ్ విభాగంలో కాంస్య (బ్రాంజ్) పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. పుట్టుకతోనే చేతులు లేకపోయినా, తన అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆర్చరీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ యువతకు రోెల్ మోడల్గా నిలుస్తున్న శీతల్ విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ కురుస్తోంది.