సాగర్ పిక్చర్స్ బిగ్ అనౌన్స్మెంట్: 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం’ సినిమాటిక్ యూనివర్స్!
సూర్యా న్యూస్ డెస్క్
బుల్లితెరపై ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి క్లాసిక్ ధారావాహికలతో చెరగని ముద్ర వేసిన సాగర్ కుటుంబం వెండితెరపైకి భారీ పౌరాణిక ప్రపంచాన్ని తీసుకువస్తోంది. ‘శ్రీమద్భాగవతం’ ఆధారాన్ని ఏకంగా ఏడు భాగాల సినిమాటిక్ యూనివర్స్గా నిర్మించనున్నట్లు ప్రకటించగా, ఇందులో తొలి అధ్యాయంగా ‘విష్ణురథ’ రానుంది.
భారతీయ పౌరాణిక గాథలను బుల్లితెరపై అత్యంత అద్భుతంగా ఆవిష్కరించిన ఘనత దివంగత ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ కుటుంబానికి చెందుతుంది. ఒకప్పుడు వారు అందించిన ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి ధారావాహికలు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా సాంస్కృతిక జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. ఇప్పుడు అదే పవిత్ర ఆధ్యాత్మిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో వెండితెరపైకి తీసుకువచ్చేందుకు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ నడుం బిగించింది.
శ్రీమద్భాగవత మహాపురాణం ఆధారంగా రూపొందుతున్న ఈ బృహత్తర ప్రాజెక్ట్ను ఏకంగా ఏడు భాగాల భారీ సినిమాటిక్ యూనివర్స్గా మలచనున్నారు. ఇందులో మొదటి భాగంగా ‘శ్రీమద్భాగవతం పార్ట్-1: విష్ణురథ’ శీర్షికతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రామానంద్ సాగర్ మనుమళ్ళు, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గ్రహీతలు అయిన ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ చోప్రా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆరు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన అనంతరం ఈ స్క్రిప్ట్ను వారు సిద్ధం చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు వేడుక జరగగా, అక్కడే ఏర్పాటు చేసిన భారీ సెట్లలో లైవ్-యాక్షన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ పౌరాణిక దృశ్యకావ్యం కోసం హాలీవుడ్కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నిపుణుడు క్లైడ్ ఎడ్వర్డ్స్ సేవలందిస్తున్నారు. గతంలో ఈయన ‘లైఫ్ ఆఫ్ పై’, ‘ది జంగిల్ బుక్’, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రఖ్యాత ప్రాజెక్టులకు పనిచేశారు.
భారతీయ సంస్కృతి, భక్తి తత్వాలలోని అసలుసిసలైన మూలాలను దెబ్బతీయకుండా, నేటి ఆధునిక తరానికి సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడు భాగాల మహా కావ్యంలో మొదటి అధ్యాయమైన ‘విష్ణురథ’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.