పంటలు లేక.. పనుల కోసం వలస
పాములపాడు: పాములపాడు మండల పరిధిలోని మిట్టకందాల గ్రామానికి చెందిన రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాకు వలస వెళ్లారు. గ్రామానికి చెందిన దాదాపు 12 కుటుంబాలు పత్తి సాగు పనులతో పాటు ఇతర వ్యవసాయ పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్లినట్లు తెలిపారు.
గ్రామంలో పంటలు లేకపోవడంతో వ్యవసాయ పనులు తగ్గిపోయాయని, కూలీలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తే వలసలు నివారించవచ్చని వారు పేర్కొన్నారు.