సమాన వైశాల్య పటాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ మద్దతు
దేశిక సమగ్రతపై రాజీ పడేది లేదని స్పష్టీకరణ
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచ పటాల్లో అన్ని ఖండాల భూభాగాలను వాటి అసలు పరిమాణానికి అనుగుణంగా (సమాన వైశాల్యంలో) చూపించే విధానాన్ని ప్రోత్సహించే ఐక్యరాజ్యసమితి (యుఎన్) సర్వసభ్య సమావేశ తీర్మానానికి భారతదేశం మద్దతు తెలిపింది. అయితే, ఈ తీర్మానం ఏ నిర్దిష్ట పటాన్ని ఆమోదించదని, సార్వభౌమత్వ సరిహద్దులపై తమ స్థిరమైన వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని తేల్చిచెప్పింది.
ప్రపంచ పట ప్రాతినిధ్యాన్ని పునఃసమతుల్యం చేయడం, ప్రపంచ ప్రాంతాలకు, ముఖ్యంగా ఆఫ్రికాకు సమాన ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించడం" అనే పేరుతో సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. సాంప్రదాయ పటాల వల్ల భూభాగ పరిమాణాల్లో జరిగే వ్యత్యాసాలను తగ్గించి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ప్రాంతాల ఖండాల సాపేక్ష పరిమాణాలను సరిగ్గా చూపించేలా సమాన-ప్రాంత పటాల వాడకాన్ని పెంచడం. మీడియా ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ క్రింది విషయాలను స్పష్టం చేశారు:
ఈ తీర్మానం కేవలం భౌగోళిక వైశాల్య ప్రాతినిధ్యానికే పరిమితమని, ఇది ఏ నిర్దిష్ట ప్రపంచ పటాన్ని ఆమోదించదని లేదా ప్రామాణీకరించదని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులు, వివాదాస్పద ప్రాంతాలు లేదా ప్రదేశాల పేర్ల వంటి రాజకీయ అంశాలతో దీనికి సంబంధం లేదు.భారత ప్రయోజనాలకు కట్టుబడి ఉంటూనే సమాన-ప్రాంత పట విధానానికి మద్దతుగా ఓటు వేశామని, అయితే దీనిని ఏ జాతీయ సరిహద్దుల చిత్రీకరణకూ ఆమోదంగా భావించరాదని వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా భారతదేశ సార్వభౌమ భూభాగాన్ని భారతదేశ అధికారిక పటం ప్రకారమే చిత్రీకరించాలని రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. దేశ సరిహద్దులను తప్పుగా లేదా తప్పుదారి పట్టించే విధంగా చూపించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రాదేశిక సమగ్రత విషయంలో తమ వైఖరి "స్పష్టంగా, స్థిరంగా, రాజీపడలేనిదిగా" ఉంటుందని స్పష్టం చేశారు.