భారత్లో పర్యటించనున్న లక్సెంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్
విదేశాంగ మంత్రి జైశంకర్తో కీలక చర్చలు
న్యూఢిల్లీ: లక్సెంబర్గ్ ఉప ప్రధాని, విదేశాంగ మరియు వాణిజ్య శాఖ మంత్రి జేవియర్ బెటెల్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి రానున్నారు. సెప్టెంబర్ 7 నుండి 9 వరకు సాగే ఈ పర్యటనలో ఆయన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపడంతో పాటు ఢిల్లీ, చెన్నైలలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకోనున్న జేవియర్ బెటెల్, మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో భేటీ అవుతారు.
మంగళవారం రోజున ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ను సందర్శిస్తారు. అనంతరం లక్సెంబర్గ్కు చెందిన ప్రముఖ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ 'ఎస్ఈఎస్' (SES) నూతన క్యాంపస్ను ప్రారంభించనున్నారు. పర్యటన ముగించుకుని బుధవారం తెల్లవారుజామున ఆయన తిరుగు ప్రయాణమవుతారు.
గత జనవరిలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లక్సెంబర్గ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిగాయి.
ముఖ్యంగా లక్సెంబర్గ్ ఆర్థిక, సాంకేతిక మరియు డిజిటల్ రంగాల అభివృద్ధిలో భారతీయ సమాజం వహిస్తున్న పాత్రను జేవియర్ బెటెల్ గతంలోనే కొనియాడారు. ఈ క్రమంలో డిజిటల్ టెక్నాలజీ, ఫైనాన్స్, అంతరిక్ష రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించడానికి ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు.