సూర్య, ఎల్లారెడ్డిపేట: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై మధ్యప్రదేశ్కు చెందిన చతుర్ సింగ్ మున్నా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అప్పటి ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారణ సందర్భంగా కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల సమన్వయంతో 19 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ వాదనలు వినిపించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువైనట్లు నిర్ధారించి నిందితుడు చతుర్ సింగ్ మున్నాకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది.
మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. మహిళలు, యువతులు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు లేదా అన్యాయానికి గురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేరానికి పాల్పడిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
అధికారులకు ఎస్పీ అభినందనలు
కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి, ప్రస్తుత సిరిసిల్ల డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, అప్పటి, ప్రస్తుత సీఐలు బన్సీలాల్, వెంకటేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్సీ, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రవణ్ యాదవ్, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రమేష్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికను జిల్లా ఎస్పీ అభినందించారు.