ఐదు రోజుల పాటు ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగనున్న నిమజ్జనం
వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బయ్యని మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి తదితరులు
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 18): తాండూరు పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఐదు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన భక్తులు ఐదో రోజు నిమజ్జనానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్రలు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగాయి. వినాయక విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరే సమయంలో తాండూరులో భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువత, భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పులు, బ్యాండ్ మేళాలు, నృత్యాలతో గణేష్ మండపాల నిర్వాహకులు, యువత సందడి చేశారు.తాండూరు పట్టణంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులు, పరిసర ప్రాంతాల్లో సుమారు 285 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించిన అనంతరం శుక్రవారం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడలైన భద్రేశ్వర దేవాలయం వద్దకు వినాయక విగ్రహాలు భారీగా చేరుకున్నాయి. అక్కడి నుంచి మార్వాడి బజార్, డీఎస్పీ కార్యాలయం, శాంత్ మహల్ చౌరస్తా, వినాయక్ చౌక్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కోకట్ కాగ్నా నదికి విగ్రహాలను తరలించి నిమజ్జనం చేశారు. మరికొన్ని విగ్రహాలను శివాజీ చౌక్ మీదుగా మాల్రెడ్డిపల్లి చెరువుకు తరలించి నిమజ్జనం చేశారు.నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో సీఐలు ప్రవీణ్కుమార్రెడ్డి, పరమేశ్వర్గౌడ్ తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జన మార్గాలు, ప్రధాన కూడళ్లు, చెరువు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రతి ఏడాది ఆనవాయితీగా భద్రేశ్వర దేవాలయం వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, సీనియర్ నేతలు కరణం పురుషోత్తంరావు, మురళీకృష్ణగౌడ్, రవిగౌడ్, నర్సింలు, ప్రభాకర్గౌడ్, బాల్రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తాండూరులో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించడం వల్ల వేడుకలు సజావుగా సాగాయని పేర్కొన్నారు. భాగ్యనగరంలో నిర్వహించే విధంగా తాండూరులోనూ వినాయక నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.