☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం

19 Sep 2026 Reporter

ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం
150 ఏళ్ల మున్సిపాలిటీ చరిత్రను చాటేలా వేడుకలు
ఒంగోలు మన గౌరవం నినాదంతో పలు కార్యక్రమాలు
28, 29, 30 తేదీల్లో వేడుకలు.. ప్రజలంతా పాల్గొనాలి: మాగుంట
81 వేల కుటుంబాలకు తడి, పొడి చెత్త వేరు చేసే బ్యాగులు
మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌తో ప్రజల్లో పెరిగిన అవగాహన: ఎమ్మెల్యే  దామచర్ల
సూర్య ప్రతినిధి ఒంగోలు : 

 ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నగర ఘన చరిత్రను ప్రజలందరికీ తెలియజేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ‘ఒంగోలు–మన గౌరవం’ నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం స్థానిక కబాడీపాలెం వద్ద నిర్వహించిన మెగా సెగ్రిగేషన్ డ్రైవ్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని సుమారు 81 వేల గృహాలకు తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు బ్యాగులు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పిలుపుతో కుటుంబ సభ్యులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానంపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే చొరవతో వేడుకలను పండుగలా నిర్వహించేందుకు నిర్ణయించడం సంతోషకరమన్నారు. మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ విశిష్టమైన కార్యక్రమమని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా చెత్త నిర్వహణ సులభతరం అవుతుందని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళల సహకారం అభినందనీయమన్నారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు మాట్లాడుతూ ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో గత మూడు నెలలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 150 మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచిత వైద్య సేవలతో పాటు మందులు అందించినట్లు చెప్పారు. 81 వేల కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరు చేసే బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ కొందరు కాలువల్లో చెత్త వేస్తున్నప్పటికీ, చెత్తను వేరు చేసి పారవేయడంపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఈ నెల 27న సుమారు మూడు వేల మందితో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న భారీగా ఒంగోలు గిత్తల ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. వేడుకల నిర్వహణకు కలెక్టర్, ఎంపీ అందిస్తున్న సహకారం గొప్పదన్నారు.
కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ కృష్ణయ్య, ఎంహెచ్‌ఓ వైష్ణవి, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు గానుగపాలెం, ఆంధ్రకేసరి నగర్, గాంధీనగర్, కొత్త మామిడిపాలెం డంపింగ్ యార్డుల వద్ద నిర్వహించిన సెగ్రిగేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home