ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నిఘంటువు
ముంబై: భారతదేశ భాషా వైవిధ్యమే దేశ బలానికి మూలమని, మాతృభాషలతో పాటు భారతీయ భాషలన్నింటినీ ప్రోత్సహించడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో జరిగిన 'హిందీ దివస్ 2026' వేడుకలు, 6వ అఖిల భారత అధికారిక భాషా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుతం 8 లక్షల పదాలతో రూపుదిద్దుకుంటున్న 'హిందీ శబ్ద-సింధు' డిజిటల్ నిఘంటువులో తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి భాషల నుండి 50,000కు పైగా పదాలను చేర్చినట్లు వెల్లడించారు. ఈ నిఘంటువు 2029 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద నిఘంటువుగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ సృష్టించిన ప్రామాణిక పదాలను కూడా ఇందులో చేరుస్తున్నట్లు చెప్పారు.
సాంకేతికత ద్వారా భాషల అనువాదానికి ఏఐ ప్లాట్ఫామ్లు 'కంఠాస్థ 2.0', 'లీలా రాజభాష'లను ప్రభుత్వం విస్తరిస్తోందని చెప్పారు. జేఈఈ, నీట్ వంటి పరీక్షలను 13 భాషల్లో నిర్వహిస్తూ మాతృభాషా విద్యకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్భాష రంగానికి సేవలు అందించిన వారికి ఈ సందర్భంగా ఆయన 'రాజ్భాష కీర్తి పురస్కారాల'ను ప్రదానం చేశారు.