ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బ్రిక్స్ నేతలకు ఘన విందు
'నవరస' సాంస్కృతిక ప్రదర్శన, 'బ్రిక్స్ సింఫనీ' ప్రత్యేక ఆకర్షణ
న్యూఢిల్లీ:18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అగ్రనేతలు, అంతర్జాతీయ ప్రతినిధుల కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన విందు (Gala Dinner) ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ టోకాయెవ్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు.
భారతీయ సంస్కృతి, పాక కళా వైవిధ్యాన్ని చాటిచెబుతూ ప్రత్యేకంగా రూపొందించిన శాకాహార మెనూ ఈ విందుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విందు సందర్భంగా "నవరస - ఉమ్మడి భావోద్వేగాల విశ్వం" పేరిట భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలతో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అలాగే బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల కళాకారులు కలసి నిర్వహించిన "ఒకే లయ, అనేక సంస్కృతులు" అనే 'బ్రిక్స్ సింఫనీ' (BRICS Symphony) సంగీత ప్రదర్శన వివిధ దేశాల నాగరికతల ఐక్యతను, ఉమ్మడి బంధాలను చాటిచెప్పింది. "మానవత్వమే ప్రథమం" అనే స్ఫూర్తితో జరిగిన ఈ విందు వేడుక ప్రపంచ నేతలను ఎంతగానో ఆకట్టుకుంది.