తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : హైదరాబాద్ సనత్నగర్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్ ) ఆసుపత్రిలో భారీ చోరీ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు పక్కా పథకంతో ఆసుపత్రిలోకి ప్రవేశించి లక్షల విలువైన వైద్య పరికరాలను ఎత్తుకెళ్లారు. అకడమిక్ బ్లాక్లోని స్టోరేజ్ రూమ్నే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడటం ఆసుపత్రి భద్రతపై చర్చకు దారితీసింది. టిమ్స్ ఆసుపత్రి అకడమిక్ బ్లాక్ ఐదో అంతస్తులో ఉన్న స్టోరేజ్ రూమ్లో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఐఓఎస్ పరికరాలను భద్రపరిచారు. ఈ గదిని గుర్తించిన దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్న 12 ఐవోఎస్ బాక్సులను అపహరించారు. ఒక్కో బాక్సులో 24 పరికరాలు ఉండటంతో మొత్తం 288 ఐవోఎస్ పరికరాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 13న ఉదయం 7.30 గంటల నుంచి 8 గంటల మధ్య చోరీ జరిగినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించాయి. ఘటనను గుర్తించిన సైట్ ఇంజనీర్ ఎన్. నాగ సాయివంశీ కృష్ణ వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఐదో అంతస్తులోని స్టోరేజ్ రూమ్ వరకు దుండగులు ఎలా చేరుకున్నారు? వారికి ఆసుపత్రి ప్రాంగణం, గదుల అమరికపై ముందస్తు సమాచారం ఉందా? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగతనంలో ఆసుపత్రికి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా ? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రిని 2026 ఆగస్టు 17న సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ప్రారంభించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో కార్డియాక్, రీనల్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ విభాగాలకు సంబంధించిన ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఓపీ నమోదు, టోకెన్ వ్యవస్థ, వైద్యుల సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ రంగంలో అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన, ఇతర పనులు చేయగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్మించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి అత్యాధునిక ఆసుపత్రిలో చోరీ జరగటం కలకలం రేపుతోంది. భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.