తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు దానం నాగేందర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్కు ఉపఎన్నికలు కలిసి రావని.. ఖైరతాబాద్లో మళ్లీ పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన రఘునందన్రావు.. దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి.. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారారని పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు వెళ్లడం దానం నాగేందర్కు రాజకీయ విధానంగా మారిందని విమర్శించారు. గతంలోనూ దానం నాగేందర్ ఉపఎన్నికల్లో ఓడిపోయారని.. ఇప్పుడు ఖైరతాబాద్లో మళ్లీ ఎన్నిక జరిగితే అదే పరిస్థితి ఎదురవుతుందని రఘునందన్రావు అన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అనంతరం 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి.. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది.
స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి మరీ హైకోర్టు అనర్హత వేటు
స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టి దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఆయనపై అనర్హత 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి తీర్పు కాపీలను పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ఖైరతాబాద్లో ఉపఎన్నికకు మార్గం ఏర్పడినప్పటికీ.. ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నికపై తదుపరి పరిణామాలు న్యాయపరమైన ప్రక్రియపైనా ఆధారపడి ఉంటాయి. ఖైరతాబాద్ ఉపఎన్నిక జరిగితే బీజేపీ విజయం సాధిస్తుందని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. దానం నాగేందర్కు బైఎలక్షన్లు కలిసి రావని.. నియోజకవర్గంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై కూడా రఘునందన్రావు విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు రాజకీయంగా భిన్నంగా కనిపించినా.. కొన్ని అంశాల్లో ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఇరు పార్టీలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్, రేవంత్రెడ్డి ప్రభుత్వాలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాం పాలనకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. అసెంబ్లీలో గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను రఘునందన్రావు మీడియా ముందు ప్రదర్శించారు. ఎంఐఎంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన విమర్శలు చేశారు.