గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ.
పటాన్ చెరు ; గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి ఎం. నాగేష్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘ఫైనాన్షియల్ టైమ్ సిరీస్ ఫోర్ కాస్టింగ్ కోసం హైబ్రిడ్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మోడల్స్’పై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత, గణాంక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ నాగేష్ పరిశోధన, ఫైనాన్షియల్ మార్కెట్ల లోని నాన్ లీనియారిటీ (అసరళత), వోలటిలిటీ (అస్థిరత), స్ట్రక్చరల్ బ్రేక్స్ (నిర్మాణాత్మక విఘాతాలు), టైమ్-వేరియింగ్ డిపెండెన్సీస్ (కాలంతో పాటు మారే వాటిపై ఆధారపడటం) వంటి సవాళ్లను పరిష్కరించడానికి, స్టాటిస్టికల్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ పద్ధతులను ఏకీకృతం చేసి ఒక హైబ్రిడ్ ఫోర్ కాస్టింగ్ ఫ్రేమ్ వర్కును అభివృద్ధి చేస్తుందని తెలియజేశారు. ఈ అధ్యయనం, విధానాలను ఉపయోగించి, నాలుగు ఫైనాన్షియల్ టైమ్ సిరీస్ లను- ప్రపంచ ముడి చమురు ధరలు, భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహాలు, నిఫ్టీ ఆటో ఇండెక్స్, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ విశ్లేషిస్తుందని వివరించారు.అధిక అస్థిరత గల డేటా సెట్లపై డీప్ లెర్నింగ్ నమూనాలు బలంగా పనిచేస్తాయని, అయితే స్థూల ఆర్థిక, రంగాల సూచికలకు హైబ్రిడ్ నమూనాలను అధిక కచ్చితత్వం, స్థిరత్వాన్ని అందిస్తాయని ఈ పరిశోధన ఫలితాలు నిరూపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా, స్టాక్-ఇండెక్స్ అంచనా కోసం ఒక పటిష్టమైన నమూనాగా నిలుస్తుందన్నారు. ఈ అధ్యయనం డేటా సెట్లకు ప్రత్యేకమైన నమూనా ఎంపిక ప్రాముఖ్యతను విశదీకరిస్తోందని, కచ్చితమైన, అనుకూలమైన, పటిష్టమైన ఆర్థిక అంచనాల కోసం హైబ్రిడ్ విధానాల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని వివరించారు.డాక్టర్ నాగేష్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జాదవ్ గణేష్, విషయ నిపుణులు ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు, డాక్టర్ కృష్ణ కుమ్మరి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించడమే గాక, ఆర్థిక టైమ్-సిరీస్ అంచనాలకు చేసిన గణనీయమైన కృషిని అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.