-
తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా ఉద్యోగాలు
రికార్డు స్థాయిలో 30 వేల రిజిస్ట్రేషన్లు
నియామకాలకు ముందుకొచ్చిన 350 కంపెనీలు
ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో మెగా జాబ్ మేళా
కోదాడ, సెప్టెంబర్ 19: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు యువత నుంచి భారీ స్పందన లభించింది.
స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రారంభమైన ఈ జాబ్ మేళాలో తొలి రెండు గంటల్లోనే 700 మందికి పైగా యువత ఉద్యోగాలు సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీలు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందజేశాయి.
ఈ మెగా జాబ్ మేళాకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టారు.
ఆయన పిలుపుతో ఐటీ, ఫార్మా, తయారీ, వైద్య, బ్యాంకింగ్, రిటైల్ సహా అనేక రంగాలకు చెందిన 350 ప్రముఖ కంపెనీలు నియామకాలు చేపట్టేందుకు ముందుకొచ్చాయి. జాబ్ మేళాకు రికార్డు స్థాయిలో 30 వేల మందికి పైగా యువత పేర్లు నమోదు చేసుకున్నారు.
ఉదయం నుంచే జాబ్ మేళా ప్రాంగణానికి వేలాది మంది ఉద్యోగార్థులు తరలివచ్చారు. వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద అభ్యర్థుల వివరాలను పరిశీలించి, స్క్రీనింగ్ పరీక్షలు, ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులను వెంటనే ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. రోజు ముగిసే సమయానికి ఉద్యోగాలు పొందే యువత సంఖ్య మరింత పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కంపెనీల స్టాళ్లను సందర్శించి నియామక ప్రక్రియను పరిశీలించారు. కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు, ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మాట్లాడారు. తొలి విడతలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించి, వారి భవిష్యత్తు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ యువతలో ప్రతిభకు కొదవ లేదని, వారికి సరైన అవకాశం కల్పిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రముఖ కంపెనీలను వారి ఇంటి ముంగిటకే తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగార్థులకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చిన 350 కంపెనీలకు మంత్రి ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు.
కోదాడ మెగా జాబ్ మేళా వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు నింపిందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషికి ఈ జాబ్ మేళా నిదర్శనమన్నారు. నియామక ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించినట్లు తెలిపారు.