కొచ్చి:భారత నౌకాదళ పోరాట పటవాన్ని మరింత శక్తివంతం చేసే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయి నమోదైంది. కొచ్చిలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) వేదికగా నౌకాదళానికి చెందిన తొలి నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెస్సెల్ (NGMV) 'కీల్ లేయింగ్' (పునాది శంకుస్థాపన) కార్యక్రమం సెప్టెంబర్ 18న అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి యుద్ధనౌకల ఉత్పత్తి మరియు సేకరణ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ సంజయ్ సాధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొచ్చిన్ షిప్యార్డ్ మరియు భారత నౌకాదళానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్ వెస్సెల్స్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ మార్చి 2023లో కుదిరింది.
ఈ అత్యాధునిక క్షిపణి నౌకలు అత్యుత్తమ ఆయుధ సంపత్తి, సెన్సార్ వ్యవస్థలతో రూపుదిద్దుకుంటున్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సంక్లిష్టమైన సముద్ర వాతావరణంలో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నౌకల్లో ఉపయోగించే ప్రధాన పరికరాలన్నీ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపుదిద్దుకుంటుండటం విశేషం. కేంద్ర ప్రభుత్వ 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' మరియు 'మేక్ ఫర్ ది వరల్డ్' దార్శనికతలకు అద్దం పడుతూ, దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు మరోసారి చాటిచెప్పింది.