న్యూఢిల్లీ: వేగవంతమైన అభివృద్ధి, పర్యావరణ సుస్థిరత రెండూ కలిసి ముందుకు సాగగలవని ప్రపంచానికి భారత్ నిరూపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలిపారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన “పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత భవిష్యత్తు” అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రకృతితో భారతదేశానికి ఉన్న సుదీర్ఘ సాంస్కృతిక అనుబంధమే ఆధునిక వాతావరణ సవాళ్లను ఎదుర్కొనే విధానానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను బాధ్యులను చేయడం సరికాదని ప్రధాని మోదీ అన్నారు. భారత్ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. COP-21 పారిస్ వాతావరణ లక్ష్యాలను నిర్ణీత గడువు కంటే ముందే సాధించిన ఏకైక G20 దేశం భారతదేశమేనని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి గ్లోబల్ కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని చెప్పారు.
గత 12 ఏళ్లలో దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుండి 160 గిగావాట్లకు పైగా పెరిగిందని ప్రధాని తెలిపారు. 'ప్రధాని సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన' ద్వారా 50 లక్షలకు పైగా గృహాలకు సౌర విద్యుత్ను అందించామని, 'పీఎం-కుసుమ్' కింద 30 లక్షల మంది రైతులకు సోలార్ పంపులు అందజేశామని వివరించారు. 'ఒకే దేశం-ఒకే గ్రిడ్' ద్వారా 20 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు.
హరిత రవాణా రంగంలో సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, దేశపు మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం, వార్షిక ఈవీ అమ్మకాలు 25 లక్షలకు చేరడం, మెట్రో నెట్వర్క్ 1,000 కిలోమీటర్లు దాటడం మరియు రైల్వేల విద్యుదీకరణ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. జల సంరక్షణలో భాగంగా 70,000 కు పైగా 'అమృత్ సరోవర్లు' నిర్మించామని, 'క్యాచ్ ది రెయిన్' మరియు సూక్ష్మ నీటిపారుదల ద్వారా 2 కోట్లకు పైగా రైతులకు ప్రయోజనం చేకూరిందని చెప్పారు. అలాగే గడిచిన 12 ఏళ్లలో దట్టమైన అటవీ విస్తీర్ణం 22 శాతానికి పైగా పెరిగిందని ప్రధాని మోదీ వివరించారు.