☼ Suryaa News
🔴 జాతీయం భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కన్నా తక్కువ
జాతీయం

భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కన్నా తక్కువ

19 Sep 2026 vasu

న్యూఢిల్లీ:ప్రకృతి పరిరక్షణలో భారతదేశం శతాబ్దాలుగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని, నేటి ఆధునిక వాతావరణ సవాళ్లకు కూడా ఐక్యతతో కూడిన పరిష్కారాలను అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నిర్వహించిన “పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత భవిష్యత్తు” అంతర్జాతీయ సదస్సును శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్‌జీటీ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు రూపొందించిన నూతన ‘ఎన్‌జీటీ మొబైల్ యాప్’ను ప్రధాని ఆవిష్కరించారు.

కార్బన్ ఉద్గారాల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్న ప్రధాని, భారతదేశ తలసరి కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల తలసరి ఉద్గారాలు భారత్ కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. గడిచిన 12 ఏళ్లలో పునరుత్పాదక ఇంధనం, సౌరశక్తి, శిలాజేతర ఇంధన రంగాలలో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచం నలుమూలలా కొనియాడుతున్నారని, పారిస్ ఒప్పంద లక్ష్యాలను భారత్ నిర్దేశిత సమయం కంటే ముందే సాధించి అమెరికా, ఐరోపా సమాజాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవతో పాటు పలువురు న్యాయ, పర్యావరణ నిపుణులు పాల్గొన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు, సంస్థలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home