భారీ శబ్దంతో బెంబేలెత్తిన స్థానికులు.. ఇంటి అద్దాలు ధ్వంసం
విస్ఫోటనంపై పోలీసుల దర్యాప్తు.…అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని మహిపాల వీధిలో ఆదివారం ఉదయం
భారీ విస్ఫోటనం కలకలం రేపింది. రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎం.ఎస్.ఎన్. మూర్తి నివాసంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విస్ఫోటనం ధాటికి ఇంటి కిటికీలు, అద్దాలు ధ్వంసమై దూరంగా ఎగిరిపడ్డాయి.
ఆ సమయంలో పై బెడ్రూమ్లో ఉన్న మూర్తి కుమారులు గది నుంచి బయటకు ఎగిరిపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో మలిశెట్టి సాయిరామ్ (24)కు చేతులు, కాళ్లకు సుమారు 20 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ట్రస్ట్ ఆసుపత్రి ప్రత్యేక బర్న్స్ వార్డుకు తరలిస్తున్నారు.
అయితే ఈ భారీ విస్ఫోటనానికి అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. పిడుగుపాటు కారణమా? లేక గ్యాస్ సిలిండర్ పేలుడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోని రెండు గ్యాస్ సిలిండర్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తేల్చేందుకు రాజమండ్రి నుంచి ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.
అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, పట్టణ సీఐ వీరబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, టీడీపీ నాయకుడు మెట్ల రమణబాబు, జనసేన నాయకులు కల్వకొలను తాతాజీ, ఏడిద శ్రీను తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.