తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను, ఎన్టీఆర్ అభిమానులను తనవైపు తిప్పుకునేలా ఆయన రాజకీయ బాణాలను ఎక్కుపెట్టారు.
రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ గడ్డపై నందమూరి తారక రామారావుకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడుకి ఎంతో మంది సహచరులు, అనుచరులు ఈ రాష్ట్రంలో ఉన్నారు’.. ‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని లేకుండా చేయాలని కక్ష కట్టి, ఆ పార్టీ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అప్పట్లో టీడీపీని తుడిచిపెట్టడానికి వారు చేయని ప్రయత్నం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా.. ‘ఆనాడు పచ్చ జెండాను అణిచివేసిన బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు సమూలంగా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఆ పార్టీ నాయకులు గద్దెలు దిగాలి, గ్రామాల్లో ఆ పార్టీ దిమ్మలు కూలిపోవాలి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసినప్పుడే నందమూరి తారక రామారావు గారికి మనము నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామన్నారు. మనమందరం కలిసికట్టుగా ఉండి బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ రాజకీయాల్లో ప్రజాస్వామ్యం నిలబడుతుందని పిలుపునిచ్చారు.
వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం..?
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ఖమ్మం లాంటి జిల్లాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీడీపీ నేతలను ఫిరాయింపులకు గురిచేసి ఆ పార్టీని బలహీనపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తద్వారా పాత కక్షలను తవ్వి తీసి, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్ గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నిర్వహించిన ఈ బహిరంగ సభలో ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ జెండాలు కనిపించడం విశేషం. ఇది భవిష్యత్తులో తెలంగాణలో మారనున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. కేసీఆర్ పార్టీని పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సాగిస్తున్న ఈ ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa