మునుగోడు నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై విధిస్తున్న ఆంక్షల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మునుగోడులోని తన కార్యాలయంలో మద్యం వ్యాపారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటికే అమలులో ఉన్న మద్యం షాపుల వేళల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని.. ఆరోగ్యకరమైన సమాజం కోసం వీటిని కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.
కొత్త సమయపాలన నిబంధనలు..
ప్రజల ఆరోగ్యం, ఉదయం పూట మద్యం సేవించే అలవాటును అరికట్టడమే లక్ష్యంగా ఎమ్మెల్యే కొన్ని కఠిన నిబంధనలను గుర్తు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట (1:00 PM) దాటిన తర్వాతే మద్యం దుకాణాలు తెరవాలి. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూములలో మద్యం సేవించేందుకు అనుమతించాలి. ఉదయాన్నే మద్యం విక్రయించి సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేయవద్దని వ్యాపారులను కోరారు.
మద్యం వ్యాపారం కేవలం లాభాల కోసమే కాకుండా... సామాజిక బాధ్యతతో కూడి ఉండాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి బానిస కాకుండా చూసేందుకు గ్రామాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రమాదాల నివారణకు పోలీసుల సహకారంతో తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజల నుంచి సానుకూల స్పందన...
మునుగోడులో అమలు చేస్తున్న ఈ మద్యం నియంత్రణ పద్ధతులపై ఇతర ప్రాంతాల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దని.. గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా వ్యాపారులు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే షాపులపై లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని... గొడవలు తగ్గుతాయని స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa