ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ ప్రజలకు గుడ్‌న్యూస్..డివిజన్లకు రూ. 300 కోట్ల నిధులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 08:04 PM

హైదరాబాద్ ప్రజలకు జీహెచ్ఎంసీ పాలక మండలి శుభవార్త చెప్పింది. నగరంలోని వివిధ డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 25) జరిగిన జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో మేయర్ విజయలక్ష్మి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్న డివిజన్లకు రూ. 300 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆయా డివిజన్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం త్వరలో (2026 ఫిబ్రవరి 11) ముగియునుంది. ఈ నేపథ్యంలో తన చివరి మండలి సమావేశానికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డివిజన్ల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 డివిజన్లకుగానూ రూ. 300 కోట్ల కేటాయించారు. అంటే ఒక్కో డివిజన్‌కు రూ. 2 కోట్లు మంజూరు చేయనున్నారు.


'హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడ్డాను..'


తన చివరి మండలి సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నగర అభివృద్ధికి సరికొత్త దశ, దిశ నిర్దేశించామన్నారు. ఈ మహానగర అభివృద్ధి పట్ల అందరితో కలిసి పనిచేసిన ప్రతి క్షణం తనకు ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. హైదరాబాద్‌ మేయర్‌గా.. ఆ బాధ్యతను తనపై ఉంచిన ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తాను మేయర్‌గా ఉన్న ఐదేళ్ల కాలంలో.. డివిజన్లలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్లు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలను మరింత విస్తరించినట్లు తెలిపారు. అంతేకాకుండా థీమ్ పార్కులు, అర్బన్ ఫారె‌స్ట్‌ల ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేశానన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులకు రూ. 5 అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు అందించామని తెలిపారు.


ఈ మండలి సమావేశానికి సిటీ కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరయ్యారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ కూడా వచ్చారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించారు. అయితే సమావేశం ప్రారంభంలో ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతారణం నెలకొంది. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సభలో ఆలపించారు. కొంత మంది ఎంఐఎం సభ్యులు కుర్చీలో నుంచి లేవకపోవడంతో.. బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం విమర్శలు ప్రతివిమర్శలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మార్షల్స్ వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa