తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంబన సాధించడానికి.. సొంతంగా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'రాజీవ్ యువ వికాసం' పథకం అమలులో తీవ్ర అనిశ్చితి నెలకొంది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. నెలలు గడుస్తున్నా ఈ పథకంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడం వల్ల లబ్ధిదారుల ఆశల నీరుగారిపోతున్నాయి.
ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మొత్తం 208 గ్రామ పంచాయతీల పరిధి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన 42,138 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య పథకంపై యువతలో ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది.
దరఖాస్తులను పరిశీలించడానికి, లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గాను, మండల స్థాయిలో ప్రత్యేకాధికారి కన్వీనర్గా ఎంపీడీవో, బ్యాంక్ మేనేజర్, కార్పొరేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీలను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. కమిటీలు సిబిల్ స్కోర్ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి, వారి వివరాలను జిల్లా కేంద్రానికి పంపించడం కూడా జరిగింది.
రాజీవ్ యువ వికాసం పథకం ముఖ్య ఉద్దేశం, బ్యాంక్ రుణంతో పాటు కార్పొరేషన్ల ద్వారా పూర్తి రాయితీని అందించడం. ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులకు వారి అవసరాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. రాయితీ వివరాలు రుణ మొత్తంపై ఆధారపడి ఉంటాయి. రూ. 1 లక్ష లోపు రుణానికి 80 శాతం రాయితీ, రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల లోపు రుణానికి 70 శాతం రాయితీ, రూ. 4 లక్షల వరకు రుణానికి 60 శాతం వరకు రాయితీ అందిస్తారు.
జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొంతమంది లబ్ధిదారులకు ఈ సాయం అందుతుందని అంతా ఆశించారు. కానీ అది జరగలేదు. ఈ విషయంపై జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజును వివరణ కోరగా.. 'ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు, నిధుల కేటాయింపు ఉత్తర్వులు రావాల్సి ఉంది' అని ఆయన తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా, యువత స్వయం ఉపాధి కలలు నిరీక్షణలో ఉండిపోయాయి. యువత ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న ఈ పథకం త్వరగా అమలు కావాలని నిరుద్యోగులు వేడుకుంటున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa