తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలపై.. ముఖ్యంగా వారి అగ్రనాయకులపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలను ఉద్దేశించి 'బ్యాడ్ బ్రదర్స్' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.
రేవంత్ రెడ్డి తన ప్రచారంలో హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ.. కేటీఆర్, కిషన్రెడ్డిల పాత్రను ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ వంటి ముఖ్య ప్రాజెక్టులను ఈ 'బ్యాడ్ బ్రదర్స్' కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు వీరిద్దరినీ అభివృద్ధి నిరోధకులుగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రధాన ప్రాజెక్టులను తీసుకొచ్చి హైదరాబాద్ను గ్రోత్ ఇంజిన్గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. గతంలో టీడీపీ ప్రభుత్వ సహకారం కూడా ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్ వరదల్లో మునిగిపోయినప్పుడు కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన కిషన్రెడ్డి.. ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. అలాగే.. సచివాలయంలో దేవాలయం కూల్చివేసినప్పుడు కూడా కిషన్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని.. ఈ సొమ్మును గోదావరిలో పోశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను కొల్లగొట్టి ఫామ్హౌస్లు నిర్మించుకుందని.. అక్రమ సంపాదనకు పాల్పడిందని విమర్శించారు.
కొత్త సచివాలయం, ప్రగతి భవన్ నిర్మాణాలు కేసీఆర్ కొడుకు భవిష్యత్తు.. వాస్తు కోసం తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకే కమాండ్ కంట్రోల్ రూమ్ను నిర్మించారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులను ఇబ్బంది పెట్టగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గణాంకాలు వివరించారు. రేవంత్ రెడ్డి 2047 విజన్ డాక్యుమెంట్ను ప్లాన్ చేస్తున్నామని చెబుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa