తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ప్రత్యర్థులపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఈ ఉపఎన్నిక ప్రచారంపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. ఎంపీ అర్వింద్ జూబ్లీహిల్స్లో ప్రత్యక్ష ప్రచారానికి రాకపోయినా.. తనదైన సోషల్ మీడియా వ్యూహాన్ని అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశమైంది.
ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే.. తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించకపోయినా.. తన మాటలు, విమర్శలు సోషల్ మీడియా ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘జూబ్లీహిల్స్కు వచ్చి ప్రచారం చేస్తేనే చేసినట్లు కాదు.. ఎక్కడి నుంచి చేసినా చేసినట్లే’ అని ఆయన అన్నారు. అనవసరంగా ప్రచారానికి రాలేదని తనపై ఫిర్యాదులు చేయవద్దని పార్టీ శ్రేణులకు అర్వింద్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక నిజామాబాద్లో పార్టీ బలంగా ఉందని.. ఆ విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. ఎంపీ అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక అసమర్థ ముఖ్యమంత్రి అని ఆరోపించిన అర్వింద్.. ఆయన కేసీఆర్తో ములాఖత్ అయ్యారని సంచలన ఆరోపణ చేశారు. రెండు పార్టీలు కూడా ఒక్కటే అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో లెక్కలేనన్ని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి లక్ష కోట్ల రూపాయలు ముంచేసి.. తెలంగాణను అప్పులపాలు చేశారని దుమ్మెత్తిపోశారు.
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కీలక కేసుల్లో రేవంత్ సర్కారు ముందుకు వెళ్లలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డు ఆదాయాన్ని సైతం కేసీఆర్ తన హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకే తరలించారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే.. ఈ కేసులపై దర్యాప్తు వేగవంతం అవుతుందని.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడతాయని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa