పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ.. కొందరు లబ్ధిదారులు ఇప్పటికీ నిర్మాణాలను ప్రారంభించకపోవడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. నిర్మాణాలను మొదలుపెట్టని ఇళ్లను రద్దు చేసే దిశగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఇంటి స్థలాన్ని మార్కింగ్ చేసిన 45 రోజుల్లోగా నిర్మాణ పనులు తప్పనిసరిగా ప్రారంభించాలి. అయితే, చాలామంది లబ్ధిదారులు ఈ గడువును దాటినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే వారికి మరో 15 రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. దీంతో, ఈ నెలాఖరులోగా నిర్మాణాలు ప్రారంభించని వారి నుంచి అంగీకార పత్రం తీసుకొని, వారి గృహ నిర్మాణ మంజూరును రద్దు చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రద్దు చేయబడిన ఇళ్లను, వెంటనే అవసరమున్న కొత్త లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉంది.
లబ్ధిదారులు నిర్మాణాలను ఆలస్యం చేయడానికి పలు కారణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని, మిగిలిన మొత్తాన్ని స్వయంగా సమకూర్చుకోవడం పేదలకు కష్టంగా ఉందని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్దేశిత కొలతల్లో నిర్మించే గృహాలు ఇరుకుగా ఉంటాయనే అభిప్రాయంతో మరికొందరు ముందుకు రావడం లేదు. కొంతమంది తమ స్థలం విస్తీర్ణం ఎక్కువ ఉన్నందున, మరింత పెద్ద ఇంటి నిర్మాణం కోసం అదనపు నిధులు సమకూర్చుకునే ప్రయత్నంలో ఆలస్యం చేస్తున్నారు.
కొందరికి స్థలం లభ్యత, టైటిల్ సమస్యలు లేదా రుణం తీసుకునే విషయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పనులు ప్రారంభించలేకపోతున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరుగుతుండటం కూడా పేద లబ్ధిదారులకు అదనపు భారంగా మారింది. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఈ పథకాన్ని వేగంగా పూర్తి చేసేందుకు, నిర్ణీత గడువులోగా నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa