ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏం లక్కీ గురు నువ్వు.. లాటరీలో మూడు మద్యం దుకాణాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:40 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో లక్కీ డ్రా ద్వారా లైసెన్సులను కేటాయించనున్నారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రభుత్వానికి ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది. నెల 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని 243 వైన్స్ దుకాణాలకు గాను 8,634 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ. 3 లక్షలకు పెంచడంతో.. కేవలం దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ. 259.02 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గత పాలసీ కాలంలో దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు ఉన్నప్పుడు 12,227 దరఖాస్తులు రాగా.. అప్పుడు రూ. 244.54 కోట్ల ఆదాయం వచ్చింది. ఫీజును పెంచడం వలన దరఖాస్తుల సంఖ్య 3,593 తగ్గినప్పటికీ.. ప్రభుత్వానికి అదనంగా రూ. 14.48 కోట్ల ఆదాయం లభించింది. రెండేళ్ల గడువుతో ఈ లైసెన్సులు కేటాయించనున్నారు.


జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లక్కీ లాటరీలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్ అతని సిండికేట్ మొత్తం 24 షాపులకు టెండర్లు వేయగా.. వారికి ఏకంగా మూడు వైన్స్ షాపులు (షాప్ నెంబర్ 1, 3, 8) లాటరీ ద్వారా దక్కాయి. అదేవిధంగా.. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహ గౌడ్, దిలీప్ గౌడ్, ప్రభు గౌడ్ ల సిండికేట్‌కు కూడా వరుసగా మూడు షాపులు (షాప్ నెంబర్ 82, 83, 84) దక్కడంతో.. వారు కూడా హ్యాట్రిక్ కిక్‌ను ఆస్వాదించారు.


సదాశివపేట మున్సిపాలిటీలోఉన్న 16వ నెంబరు వైన్స్ షాపు వరుసగా ఏడేళ్లుగా ఒకే గ్రూప్‌కు దక్కుతుండటం గమనార్హం. గతంలో 'సరిత' పేరుపై దక్కిన షాపు, ఈసారి కూడా అదే మహిళ పేరుపై డ్రా వెళ్లడంతో ఆ గ్రూప్ సంతోషం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ లాటరీ ప్రక్రియలో నెంబర్ కన్ఫ్యూజన్ రాకుండా ప్రత్యేక గుర్తులు ఉన్న టోకెన్లను ఏర్పాటు చేశారు.


ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో జరిగిన వైన్స్ టెండర్ల ప్రక్రియలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మునిపల్లి మండలం తాటిపల్లికి చెందిన షాప్ నెంబర్ 24 లైసెన్సు కోసం ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం కనీసంగా 20 దరఖాస్తులు రావాలి. కానీ ఈ షాపునకు కేవలం 19 దరఖాస్తులు మాత్రమే అందడంతో.. అధికారులు ఆ టెండర్ ప్రక్రియను నిలిపివేశారు. ఈ షాపు టెండర్ ప్రక్రియను డిసెంబర్ 1వ తేదీ లోపు తిరిగి రీషెడ్యూల్ చేస్తామని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa