ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మట్టి ఇటుకలు తయారు చేసుకోండి.. బడి కట్టుకోండి: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:38 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ , ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ కలిసి పాల్వంచ మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామమైన బండ్రుగొండ పంచాయతీలోని కోయ గట్టు గొత్తి కోయగుంపును సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల యువత ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా తమ సామర్థ్యాలతో ఎదగాలని కలెక్టర్ యువకులతో మాట్లాడుతూ వారిలో స్పూర్తిని నింపారు.


కోయ గట్టు గొత్తి కోయగుంపు ప్రాంతంలో పాఠశాల భవనం లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్.. అక్కడి యువతకు వినూత్నమైన ఆలోచనను సూచించారు. తమ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే పక్కా భవనం తప్పనిసరని.. దీనికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అయితే.. ఈ భవన నిర్మాణానికి అయ్యే శ్రమను ఆ ప్రాంత యువతే స్వయంగా పంచుకోవాలని సూచించారు.


రోజూ కొంత సమయాన్ని కేటాయించి, స్థానికంగా లభించే మట్టితోనే ఇటుకలు తయారుచేసి.. వారి పాఠశాలను వారే నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో స్ఫూర్తి నింపేందుకు.. కలెక్టర్ స్వయంగా నేలపై కూర్చుని మట్టిని కలిపి, మట్టి ఇటుకల తయారీ విధానాన్ని వివరించడం విశేషం. ఇది యువతలో ఉత్సాహాన్ని నింపింది. కలెక్టర్ గిరిజన గ్రామస్తులతో కేవలం విద్య గురించి మాత్రమే కాకుండా.. వారి జీవనాధారం , పర్యావరణ సంరక్షణ గురించి కూడా చర్చించారు .


అటవీ ప్రాంతాల్లో చెట్లు నరకకుండా అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అడవులపై ఆధారపడకుండా ఉండేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయ జీవనాధారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. చేపలు, కౌజు పిట్టల పెంపకం , వెదురు సాగు వంటి ఉపాధి మార్గాలను ఎంచుకోవడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు. ఇటువంటి వాటిపై యువత దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్శనలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ చెన్న కేశవులు, ఇతర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. కలెక్టర్ ఈ ప్రజా కేంద్రీకృత విధానం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త దశను సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa